తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్..

17, 2026 - 18:02
 0
తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్..
Tirupati Trains

Tirupati Trains: ఏడాదికి ఒక్కసారైనా తిరుపతికి వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. ఇలాంటి వారికి రైల్వే శాఖ సరైన రవాణా సౌకర్యాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నుంచి తిరుపతికి రైలు ప్రయాణం చేసే భక్తులకు రైల్వేశాఖ నుంచి శుభవార్త అందింది. ఇంతకాలం పరిమితంగా నడిచిన రైళ్లు ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి. ఇప్పటి వరకు గురువారం, ఆదివారం మాత్రమే రెండు రైళ్లు కరీంనగర్ నుంచి నడిచేవి. కానీ ఇప్పుడు మరో రెండు రైళ్లు కూడా ఇక్కడి నుంచి వెళ్లనున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లేవారికి ఇక నుంచి గురువారం నుంచి ఆదివారం వరకు (శుక్ర, శని కూడా) నాలుగు రోజుల పాటు రైలు సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో తిరుమల దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు పెద్ద ఊరట లభించనుంది. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం నాందేడ్- ధర్మవరం ఎక్స్ ప్రెస్ ప్రతి శుక్రవారం నడుస్తుంది. అలాగే నాందేడ్ -తిరుచానూర్ ఎక్స్ ప్రెస్ ప్రతి శనివారం రెగ్యులర్ సర్వీసుగా మారింది. ఈ రెండు రైళ్లు ముందుగా పరిమిత రోజుల్లో మాత్రమే నడుస్తుండగా..జ ఇప్పుడు నిరంతర సేవగా కొనసాగించడం ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారింది.

ఈ రైళ్లు మహారాష్ట్రలో బయలు దేరి కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట వంటి ముఖ్య స్టేషన్లలో కూడా ఆగుతాయి. దీంతో ఈ ప్రాంతాల ప్రజలకు తిరుపతి ప్రయాణం మరింత సులభమైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇకపై హైదరాబాదు లేదా ఇతర నగరాలకు వెళ్లి రైలు ఎక్కాల్సిన అవసరం లేకుండా, సమీప స్టేషన్ నుంచే ప్రయాణం చేయవచ్చు. ఇప్పటికే కరీంనగర్ -తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ గురువారం, ఆదివారం రెండు రోజులు ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ సూపర్‌ఫాస్ట్ రైలు వల్ల ప్రయాణ సమయం తగ్గి, భక్తులు వేగంగా తిరుపతికి చేరుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారాంతాల్లో దర్శనం కోసం వెళ్లే వారికి ఇది మరింత సౌకర్యంగా ఉంటుంది.

కరీంనగర్ నుంచి తిరుపతికి రైళ్ల సంఖ్య పెరగడం, రెగ్యులర్ సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల భక్తుల ప్రయాణం సులభతరం కానుంది. తిరుమల దర్శనానికి వెళ్లే వారి రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం సమయోచితమని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

0
0
0
0
0
0
0