వైసీపీకి సరే.. తనకు నష్టం లేకుండా చూసుకుంటున్న జగన్!

YSR Congress Party: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా అనుకుంటే తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా చేస్తామంటేనే ఆ ప్రతిపాదన తీసుకొస్తారు ఆ ద్వయం. ఏపీలో ఇప్పుడున్న నియోజకవర్గాలకు మరో 50% పెరగనున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు 263 కు.. పార్లమెంట్ నియోజకవర్గాలు 38 కి చేరుకోనున్నాయి. అయితే డి లిమిటేషన్ అనేది ఏపీలో ఎవరికీ లాభం అనే చర్చ బలంగా నడుస్తోంది. అయితే డి లిమిటేషన్ అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెగ భయపడిపోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ డీ లిమిటేషన్ బిల్లుతో తమకు నష్టం అని తెలిసినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కేసుల భయం ఎలాగూ ఉంది. అందుకే బిజెపి అడిగిందే తడువుగా షరతులు పెట్టకుండానే మద్దతు తెలపడం చూస్తుంటే మాత్రం జాతీయస్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన చర్చగా మారింది.
* ప్రతి పార్టీతోనూ చర్చలు..
దేశవ్యాప్తంగా పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న ప్రతి పార్టీతోను కేంద్ర పెద్దలు చర్చిస్తున్నారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఎంపీలతో మాట్లాడారు. అయితే తమతో బిజెపి పెద్దలు ఏం చర్చించారో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వివరించే ప్రయత్నం చేశారు. ఏపీలో కూటమి అధికారంలో ఉన్న దృష్ట్యా ఇష్టారాజ్యంగా పునర్విభజన చేపడుతామంటే ఒప్పుకోమని వైసిపి ఎంపీలు షరతు పెట్టినట్లు చెబుతున్నారు. అటువంటి భయం ఉన్నప్పుడు డీలిమిటేషన్ బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపినట్టు అని ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. పోనీ కూటమి ఇష్టం లేకుండా కేంద్ర పెద్దలు ఏపీలో డీలిమిటేషన్ చేయగలరా? అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. కానీ అదే వాదనను తెచ్చారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మీడియా ఎదుట.
* అప్పట్లో కాంగ్రెస్ కు లబ్ధి
2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పుడు కూడా పార్లమెంటులో తెలుగుదేశం ప్రాతినిధ్యం ఉంది. అప్పట్లో కేంద్రం అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుంది. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి తమకు అనుకూలంగా డి లిమిటేషన్ చేసింది. ఇప్పుడు కూటమికి ఏపీలో ఏకపక్షంగా బలం ఉంది. పునర్విభజన కమిటీలో కమిటీలు కచ్చితంగా కూటమి సభ్యులే ఉంటారు. కూటమికి అనుకూలంగా పునర్విభజన ప్రక్రియ జరుగుతుంది కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జరగదు కదా? ఈ విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు తెలియదా?
* వ్యక్తిగత కేసులే అధికం..
ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy)ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మహిళలకు రిజర్వ్ అవుతుందని ప్రచారం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గాలు ముక్కలవుతాయని కూడా ఒక అంచనా ఉంది. కేంద్ర పెద్దల ఎదుట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బాధపడే బదులు.. ఆ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ఉండవచ్చు కదా? అనవసరంగా మద్దతు ఇచ్చి తమ నియోజకవర్గాలనే పోగొట్టుకుంటారా? ఈ బిల్లును చాలా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి కదా? వారికి మద్దతుగా వైసిపి నిలవవచ్చు కదా? అంటే డి లిమిటేషన్ కంటే జగన్మోహన్ రెడ్డికి తన వ్యక్తిగత కేసులే అధికం. అందుకే తన పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. తనకు నష్టం జరగకూడదు అనేది ఆయన అభిమతంగా తెలుస్తోంది. విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
0
0
0
0
0
0
0