పని చేయండని కొలువిస్తే.. 122 కోట్లు కొట్టేశారు..

5, 2026 - 17:30
 0
పని చేయండని కొలువిస్తే.. 122 కోట్లు కొట్టేశారు..
Badangpet Municipality Corruption

Badangpet Municipality Corruption: ఉన్నతమైన హోదా.. నెలకు లక్షలలో జీతం.. వాటికి మించిన సౌకర్యాలు.. ఇంకా రకరకాల సౌలభ్యాలు.. ఇన్ని ఉన్నప్పటికీ కూడా వారిలో ఆశ చావలేదు. ఇంకా సంపాదించాలని.. మరింత వెనకేయాలని అనుకున్నారు. కానీ చివరికి దొరికిపోయారు.

హైదరాబాదు నగర పరిధిలోని బడంగ్ పేట మున్సిపాలిటీ కార్యాలయం ఉంది. ఇది శివారు ప్రాంతం కావడంతో భూ లావాదేవీలు.. ఇతర వ్యవహారాలు భారీగా సాగుతుంటాయి. ఇక్కడ భూముల ధర కూడా విపరీతంగా ఉంది. అందువల్ల తెర వెనుక వ్యవహారాలు చాలా జరిగిపోయాయి. ముఖ్యంగా బడంగ్పేట్ మున్సిపాలిలో పనిచేసే కొంతమంది అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాశారు. ప్రభుత్వానికి సొమ్ము వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. ఆ సొమ్ముతో తమ జేబులు నింపుకున్నారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 122 కోట్లు నొక్కేశారు.

ప్రభుత్వ ఆదాయంలో తేడా రావడం.. ప్రభుత్వ ఖాతాకు డబ్బులు జమ కాకపోవడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. మరో మాటకు తావు లేకుండా విజిలెన్స్ విచారణకు అధికారులు ఉపక్రమించారు. దీంతో బడంగ్ పేట మున్సిపాలిటీలో అంతర్గత విచారణ కొనసాగించారు.

విజిలెన్స్ విచారణలో బడంగ్పేట్ మున్సిపాలిటీలో జరిగిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. మొత్తంగా 122 కోట్ల అవినీతి జరిగిందని అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో పదిమంది అధికారులకు పాత్ర ఉందని గుర్తించారు. డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న సరస్వతి.. మరో తొమ్మిది మంది అధికారులు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. ఆస్తి పన్ను నుంచి మొదలు పెడితే.. వెంచర్లకు అనుమతులు వరకు ఇలా అన్ని విషయాలలో అవినీతికి పాల్పడ్డారు. మొత్తంగా 122 కోట్లను నొక్కేశారు. ప్రాథమిక చర్యగా పదిమంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం.. తదుపరి చర్యలను తీసుకోవడానికి సిద్ధమవుతోంది.

ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మున్సిపాలిటీలో అవినీతి వ్యవహారం జోరుగా సాగింది. సిబ్బంది అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడ్డారు. ఏసీబీ అధికారులకు ఈ విషయం తెలియడంతో రంగంలోకి దిగారు. తనిఖీలు చేపట్టారు. అవినీతికి పాల్పడిన సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించగా.. బడంగ్ పేట మున్సిపాలిటీ అయితే అవినీతిలో రికార్డు సృష్టించింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన నేపథ్యంలో.. సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

0
0
0
0
0
0
0