5-5-5 .. ఈ రూల్ ఏంటి.. భార్యాభర్తలు ఎందుకు పాటించాలంటే..

17, 2026 - 18:02
 0
5-5-5 .. ఈ రూల్ ఏంటి.. భార్యాభర్తలు ఎందుకు పాటించాలంటే..
Relationship

Relationship: నేటి కాలంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంతగా ఉండడం లేదు. ఉన్నత చదువులు చదవడం.. ఇద్దరూ ఒకే స్థాయి ఉద్యోగాలు చేయడం.. ఆర్థిక స్థిరత్వంలో కూడా ఒకే తీరుగా ఉండడంతో.. పంతాలకు పోతున్నారు. పట్టింపులతో ఆహాలు పెంచుకుంటున్నారు. ఫలితంగా సంసారాలు సర్వనాశనం అవుతున్నాయి. కలకాలం వర్ధిల్లాలిసిన భార్యాభర్తల జీవితం విడాకులతో ముగిసిపోతోంది. ఈ నేపథ్యంలో నిత్యం కలహాలతో ఇబ్బంది పడే భార్యాభర్తలు ఈ సూత్రాన్ని పాటించాలని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.

భార్యాభర్తల మధ్య తరచు గొడవల వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు. అంతేకాదు, ఇలా గొడవలు కావడం వల్ల కుటుంబంలో తరచూ సమస్యలు ఎదురవుతుంటాయి. కొన్ని సందర్భాలలో ఇవి దారుణమైన ఘటనలకు కూడా కారణం అవుతుంటాయి. అలాంటప్పుడు ఈ సమస్యలను భార్యాభర్తలు త్వరగా పరిష్కరించుకోవాలి. దీనికోసం 5-5-5 రూల్ పాటించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఐదు నిమిషాలు భార్య మాట్లాడితే.. ఆ తర్వాత ఐదు నిమిషాలు భర్త మాట్లాడాలి.. మిగతా ఐదు నిమిషాలు సమస్య పరిష్కారానికి కేటాయించాలి. ఈ విధానం మొదటి ఐదు నిమిషాల్లో ఒకరి మాటను మరొకరు వినడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మధ్యలో ఇంకొకరు మాట్లాడేందుకు అవకాశం ఉండదు. అలా మధ్యలో కలగజేసుకోకూడదు. దీనివల్ల ఒకరి మనసులో ఏముంది అనేది తెలుస్తుంది. ఫలితంగా వారు పడుతున్న బాధ లేదా ఇబ్బంది తెలుస్తుంది. దీనివల్ల ఆ సమస్యకు పరిష్కార మార్గం ఏంటి అనేది అర్థమవుతుంది.

దాంపత్యం బాగుండాలంటే భార్యాభర్తలు పరస్పరం అభినందించుకోవాలి. ఒకరి పనులు మరొకరు సహాయం చేసుకోవాలి. ఉదాహరణకు భార్య వంట పని చేస్తుంటే.. భర్త కూరగాయలు కోయడం.. మంచినీళ్లు తీసుకురావడం.. స్టవ్ ఆపేయడం.. వాషింగ్ మిషన్ లో బట్టలు వేయడం.. దుస్తులు ఇస్త్రీ చేయడం వంటి పనులు చేయాలి. భర్త ఆఫీసు నుంచి వస్తే భార్య వేడివేడి కాఫీతో ఎదురు రావడం.. ఆఫీసులో చోటు చేసుకున్న పరిణామాల గురించి చర్చించడం.. భర్తకు స్నానానికి వేడి నీళ్లు పెట్టడం.. అతనితో కబుర్లు చెప్పడం.. సరదాగా వాకింగ్ వెళ్లడం వంటి పనులు చేయాలి. దీనివల్ల భర్త లో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా తనకంటూ భార్య భరోసా గా నిలుస్తుందనే నమ్మకం ఏర్పడుతుంది. ఇలా పరస్పరం ఒకరి పని ఒకరు చేసుకుంటూ.. పరస్పరం అభినందించుకుంటూ వెళ్తుంటే ఆ సంసారం గొప్పగా వర్ధిల్లుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూడకూడదు. ముఖ్యంగా పంతాలకు అసలు వినకూడదు. పట్టింపులకు వెళ్తే మరింత ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. దీనివల్ల పిల్లల మీద ఆ ప్రభావం పడుతుంది. ఫలితంగా ఒక వయసుకు వచ్చిన తర్వాత పిల్లలు కూడా మాట వినే పరిస్థితి ఉండదు. అప్పుడు భార్య భర్తలు ఒకరిని ఒకరు నిందించుకోవడం ద్వారా ఫలితం ఉండదు. సాధ్యమైనంతవరకు సావధానంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. ఒకరికి ఒకరం అన్నట్టుగా జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడే ఆ సంసారం గొప్పగా ఉంటుంది.

0
0
0
0
0
0
0