Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, అహింసా మూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి వేడుకలను ఇకపై ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారిక జీవో విడుదల చేసింది.
ఏప్రిల్ 26న అధికారిక వేడుకలు..
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి సంవత్సరం ‘వైశాఖ శుక్ల పక్ష దశమి’ రోజున వాసవి మాత జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఈ పర్వదినం ఏప్రిల్ 26వ తేదీన వస్తుండటంతో, ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది.
జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు..
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను కోరింది. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి యువజన సర్వీసులు, పర్యాటక సాంస్కృతిక శాఖను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాల కోసం అయ్యే ఖర్చును సంబంధిత శాఖ బడ్జెట్ నుంచే కేటాయించనున్నారు.
Telangana Government declares Sri Vasavi Matha Jayanthi as an annual State Function.
It will be observed every year on “Vaisakha Shukla Paksha Dashami.”
For 2026, the date falls on 26 April. pic.twitter.com/mJcHvGEiQY
— IPRDepartment (@IPRTelangana) April 23, 2026
ఆర్యవైశ్యుల హర్షం.
వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ఆర్యవైశ్య సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సమాజ సేవలో, వ్యాపార రంగంలో ముందుండే ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని ఈ నిర్ణయం పెంపొందిస్తుందని వారు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణ రావు పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఈ నెల 26న తెలంగాణవ్యాప్తంగా ఉన్న వాసవి దేవాలయాలు, ఆర్యవైశ్య సత్రాలలో వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో అత్యంత వైభవంగా జరగనున్నాయి.
0
0
0
0
0
0
0