Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

రాష్ట్ర కేబినెట్ భేటీలో ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం, కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ విచారణ వేగవంతం, క్రీడా రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలతో ప్రభుత్వం సరికొత్త కార్యాచరణను ప్రకటించింది.
ఉద్యోగుల సంక్షేమంపై ఉదారత..
గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల ఉద్యోగుల బకాయిలపై మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో వంద రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైతే ప్రజాప్రతినిధుల జీతాల నుంచి 50 శాతం నిధులు కేటాయించేందుకు మంత్రులు సిద్ధమయ్యారు. రెగ్యులర్, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి సుమారు రూ. 14,200 కోట్ల బకాయిల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించింది.
కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ సమరం..
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కేబినెట్ విశ్లేషించింది. కేవలం సాంకేతిక కారణాలతోనే కొన్ని అంశాలను కోర్టు తప్పుబట్టిందని, ఇది సీబీఐ దర్యాప్తుకు ఏమాత్రం అడ్డంకి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొమ్మిది నెలలుగా జాప్యం జరుగుతున్న సీబీఐ విచారణను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. తదుపరి చర్యలపై ఢిల్లీ న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది.
క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు గచ్చిబౌలి స్టేడియాన్ని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు 50 వేల సీటింగ్ సామర్థ్యం గల స్టేడియం నిర్మిస్తారు. మరోవైపు.. మంథని ప్రజల చిరకాల స్వప్నమైన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు రూ. 166.67 కోట్లు కేటాయించి, 45 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టింది. అలాగే, మంచిర్యాల జిల్లాలో 85 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
వీటితో పాటు.. పదవీకాలం ముగిసిన ‘పాక్స్’ (PACS) సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను నియమించాలని, ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని కేబినెట్ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ చిత్తశుద్ధిని నమ్మి కార్మికులు సంయమనం పాటించాలని కోరింది.
0
0
0
0
0
0
0