Hindu Funeral Traditions: హిందూమతంలో పసిబిడ్డలను ఎందుకు దహనం చేయరో తెలుసా? అసలు కారణం ఇదేనా!

Hindu Funeral Traditions: హిందూ సంప్రదాయంలో మరణానంతరం నిర్వహించే అంత్యక్రియలకు సంబంధించి అనేక నమ్మకాలు, శాస్త్రోక్తమైన కారణాలు ఉన్నాయి. సాధారణంగా హిందువులు మృతదేహాన్ని దహనం చేస్తారు, కానీ చిన్నపిల్లల విషయానికి వస్తే మాత్రం పాతిపెట్టడం మనం చూస్తుంటాం. అసలు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఏమిటో ఈ ప్రత్యేక స్టోరీలో తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం.. మనిషి మరణించిన తర్వాత శరీరాన్ని అగ్ని సంస్కారం చేయడం ద్వారా ఆత్మకు భౌతిక బంధాల నుంచి విముక్తి కలుగుతుందని, శరీరం పంచభూతాలలో విలీనం అవుతుందని నమ్ముతారు. అయితే చిన్నపిల్లల విషయంలో ఈ సంప్రదాయం భిన్నంగా ఉంటుంది.
శాస్త్రాల ప్రకారం.. చిన్నపిల్లలు అత్యంత స్వచ్ఛమైన మనసు కలిగినవారు. వారు జనన మరణ చక్రంలో చిక్కుకునేలా చేసే ఎలాంటి పాపపుణ్యాలు లేదా కర్మలు చేసి ఉండరు. వారి ఆత్మలు అప్పటికే పవిత్రంగా, స్వేచ్ఛగా ఉంటాయి. అందువల్ల వారిని అగ్నితో ప్రత్యేకంగా పవిత్రం చేయవలసిన అవసరం లేదని పండితులు చెబుతుంటారు. గరుడ పురాణం ప్రకారం.. పాలపళ్లు రాని లేదా ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలను దహనం చేయకూడదు. ఈ వయస్సు పిల్లల్లో ‘నేను’, ‘నాది’ అనే అహంకారం లేదా ప్రాపంచిక బంధాలు ఏర్పడవు.
ఆధ్యాత్మికంగా మనిషికి స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి. పెద్దవారిలో ఈ మూడు శరీరాల మధ్య బంధం బలంగా ఉంటుంది, దానిని వేరు చేయడానికి అగ్ని సహాయం అవసరం. కానీ పిల్లల్లో ఈ బంధం చాలా బలహీనంగా ఉండటం వల్ల వారి ఆత్మలు సులభంగా శరీరాన్ని విడిచిపెడతాయి. చిన్నపిల్లల శరీరాలు చాలా సున్నితంగా ఉంటాయి. ముఖ్యంగా వారి తల పైభాగంలో ఉండే ‘బ్రహ్మరంధ్రం’ పూర్తిగా మూసుకుపోయి ఉండదు. దీనివల్ల ప్రాణశక్తి సహజంగానే సులభంగా బయటకు పోతుంది. అందుకే పెద్దవారికి చేసే ‘కపాల క్రియ’ (తల మీద కొట్టడం) వంటి కఠినమైన ప్రక్రియలు పిల్లలకు అవసరం ఉండదు. శరీరం పంచభూతాలతో నిర్మితమవుతుంది. పిల్లల శరీరం ప్రకృతికి అత్యంత సన్నిహితంగా పరిగణించబడుతుంది. అందుకే వారిని నేరుగా మట్టికి (భూమికి) అర్పించడం అత్యంత సహజమైనదిగా భావిస్తారు.
0
0
0
0
0
0
0