మేధావి అయిన నాదెండ్ల భాస్కర్ రావు.. రాజకీయ నాయకుడు ఎందుకు కాలేకపోయారు...

23, 2026 - 22:02
 0
మేధావి అయిన నాదెండ్ల భాస్కర్ రావు.. రాజకీయ నాయకుడు ఎందుకు కాలేకపోయారు...
Nandendla Bhaskar Rao

Nandendla Bhaskar Rao: రాజకీయ శాస్త్రవేత్త సమాజానికి అవసరమయ్యే ఒక రాజకీయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించగలడు. కానీ ఆ సిద్ధాంతం అమలు పరచే రాజ్యాధికారాన్ని అతడు ఆశించకూడదు. అలా ఆశిస్తే భంగపాటు తప్పదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నాదెళ్ల భాస్కర్ రావు.

మహాత్మాగాంధీ, ఫిడెల్ కాస్ట్రో, ప్రొఫెసర్ జయశంకర్ తదితర ఎందరో రాజనీతిజ్ఞులు గొప్ప సిద్ధాంతాలను ప్రతిపాదించి సమాజ మార్పునకు దోహదం చేశారు. వారు ఇంత గొప్ప సిద్ధాంతాన్ని, భావాజాలాన్ని ప్రతిపాదించే తామే పెద్ద నేతలవ్వాలనుకోలేదు. కాబట్టే ఆయా సిద్ధాంతాలు, భావాలు విజయవంతమయ్యాయి. మేధావి, రాజకీయ పండితుడూ అయిన భాస్కరరావు కూడా ఆంధ్రప్రదేశ్ లో అప్పటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఆత్మగౌరవ సమస్య కేంద్రంగా, రాజరిక, నియంత పోకడల్లో ఉన్న కాంగ్రెస్ ని కట్టడి చేయడానికి అద్భుతమైన తెలుగుదేశం సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈ సిద్ధాంత రూపకల్పనకు భాస్కర్ రావు ఆలోచన మొదలుపెడితే కేవీ సత్యనారాయణ, తుమ్మల చౌదరి తదితర మేధావులందరూ కలిసి ఆ సిద్దాంతాన్ని తెలుగుదేశం రూపంలో ఒక రాజకీయ పార్టీని, ఎన్టీఆర్ రూపంలో ఒక గొప్ప నేతని రూపొందించారు.

సిద్ధాంతాన్ని రూపొందించడం మేధావులు, పండితుల కర్తవ్యం. దాన్ని ఆచరణలోకి అమలు చేసి ఫలితాలు సాధించాల్సింది రాజకీయ నాయకత్వమే. రాజకీయ నాయకత్వానికి ఉండాల్సిన సామర్ధ్యాలు, లక్షణాలు పండితులకి, మేధావులకు ఉండకపోవచ్చు. ఇక్కడే భాస్కర్ రావు అంచనా తప్పింది. ఆయన గొప్ప సిద్ధాంత కర్తగానే కాకుండా తానే నాయకుడినీ అవ్వాలనుకున్నారు. కానీ ప్రజలు భాస్కర్ రావులో నాయకుడిని చూడలేదు.

మేధావి అయిన భాస్కర్ రావు తన పరిధి, ప్రజలు తనని ఎలా పరిగణిస్తున్నారనే అంశాన్ని గుర్తించలేకపోయారు. అదే సమయంలో ఢిల్లీ నాయకత్వం ఆడిన రాజకీయ క్రీడలో ఆయన తన మేధస్సునీ, పాన్డిత్యాన్ని కొల్పోయి ఒక సాధారణ రాజకీయ నాయకుడిలా వ్యవహరించి తనపై ఒక చెరగని చెడుముద్ర పడడానికి స్వయంగా కారకుడయ్యాడు. ఈ ఒక్క చర్యతో ఆయన తన రాజకీయ ఎదుగుదల కోల్పోయాడు. జనాల్లోకి రాలేక ఒక మూలకి పరిమితం అయ్యాడు.

అప్పటికే ఉమ్మడి రాష్ట్ర సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక స్థితిగతులపైన ఒక చక్కటి అవగాహన, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లడానికి అవసరమైన ప్రణాళికలు ఆయన వద్ద ఉన్నప్పటికీ వాటిని ప్రతిపాదించలేని నిస్సహాయ స్థితికి భాస్కర్ రావు వెళ్లిపోయారు. రాష్ట్రం మర్చిపోలేని ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు వద్ద రెండో నెంబర్ వ్యక్తిగా గా చిన్న వయసులోనే వెలుగొందినా, ఈ పొరపాట్లతొ ఆ వెలుగును ఎక్కువ కాలం ప్రసరించలేకపోయారు.

1984లో ఎన్ఠీఆర్ నుంచి ఈయన సీఎం పదవి లాక్కోకుండా ఉన్నట్లయితే గడచిన 40 ఏళ్ళల్లో భాస్కర్ రావు తన మేధస్సు, రాజనీతితో కనీసం పాతిక, ముప్పై ఏళ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో కొనసాగేవారు. కొన్నైనా సమజాహిత పథకాలు, పాలసీలు అందించేవారు కావచ్చు. మేధావులు, సిద్ధాంతకారులు , రాజనీతి శాస్త్ర వేత్తలు సమాజానికి ఉపయోగపడే సిద్ధాంతాలు, విధానాలను రూపొందించాలే తప్ప తామే రాజకీయ నేతలవలనుకుంటే భంగపాటు ఎదుర్కొవడమే కాక అనామకులుగా మిగిలిపోవాల్సి వస్తుందనేందుకు భాస్కర్ రావే నిదర్శనం.

0
0
0
0
0
0
0